సిబిఐ స్టైల్..!
- Details
- Category: రాష్ట్రీయం
-
24 Jan 2013
- Published on Thursday, 24 January 2013 12:22
కొంత మంది గుప్పెట్లో సీబీఐ ఉందేమో అనిపిస్తోంది!.సహజన్యాయ సూత్రాలను కూడా పట్టించుకోకుండా కొంత మందే టార్గెట్గా కేసులు నడుపుతోంది. కొంతమందికి అడుగులకు మడుగులు ఒత్తుతోందా అనే అనుమానాన్ని కలిగిస్తోంది. రాష్ట్రంలో వైఎస్ జగన్ టార్గెట్గా చార్జిషీట్లు మీద చార్జిషీట్లు వేస్తూ కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతోంది. దీంతో రాజ్యాంగం సృష్టించిన ఓ అత్యున్నత సంస్థ పనితీరు ప్రశ్నార్ధకంగా మారింది. ప్రజాస్వామ్య దేశంలో అందరికీ సమన్యాయం ఉంటుంది. రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులను ప్రసాదించింది. రాజ్యాంగం ముందు ఒకళ్లు ఎక్కువ మరోకళ్లు తక్కువ కాదు. కానీ..సీబీఐ మాత్రం తనకు చట్టాలు వర్తించవు అన్నట్లు..తానే ఓ చట్టం అన్నట్లు విచారణ చేస్తుంటుంది. సహజ న్యాయసూత్రాలనే కాదు..న్యాయ సూత్రాలను కూడా సీబీఐ పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం వైఎస్ జగన్ కేసులో స్పష్టమవుతోంది అంటున్నారు న్యాయనిపుణులు. వైఎస్ జగన్ కేసు కోర్టులో విచారణకు వస్తున్నప్పుడల్లా ఏదో ఒక కేసు తిరగతోడటం ...చార్జిషీటో , అనుబంధ చార్జిషీటోనో దాఖలు చేయడం ద్వారా భయానక వాతావరణాన్ని కల్పించడం సీబీఐకు అలవాటైందని కూడా చెప్తున్నారు.
మే28, 2012 వైఎస్ జగన్ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉండగా హడావుడిగా 27-05-2012నే ఆయన అరెస్ట్ను ప్రకటించింది సీబీఐ. అంతేకాదు..ఈ తేదీకి మూడు రోజులు ముందు వాన్పిక్ కేసులో మంత్రి మోపిదేవి వెంకటరమణను అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. అంటే.. మే24 , 2012న మోపిదేవిని సీబీఐ అరెస్ట్ చేసింది. డైరక్ట్గా వైఎస్ జగన్ను అరెస్ట్ చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతోనే సీబీఐ మోపిదేవిని బలి పశువును చేసిందని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. ఢిల్లీ సూచనలు మేరకు వైఎస్ జగన్ను అరెస్ట్ చేసిన సీబీఐ 28న సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టింది. వైఎస్ జగన్కు సీబీఐ కోర్టు 14 రోజులు జుడీషియల్ రిమాండ్ విధించి ..జూన్ 11న కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. ఈ లోపు వైఎస్ జగన్ తరపు లాయర్లు జుడిషియల్ రిమాండ్పై హైకోర్టుకెళ్లారు. ఈ పిటీషన్ జూన్2, 2012న విచారణకు వస్తుంది అనగా సీబీఐ గాలి బెయిల్ స్కాంను బయటకు తీశారు సీబీఐ అధికారులు.లేని హడావుడి చేశారు. స్కాం ఎప్పుడో జరిగింది. స్కాంకు సంబంధించి కీలక పాత్రదారులపై సీబీఐ డేగ కన్ను వేసి ఉంచింది. అయితే..ఈ స్కాంను బయటపెట్టడానికి ఎన్నుకున్న సమయమే సీబీఐ మార్కును తెలియజేస్తుంది. అంతేకాదు..గాలి బెయిల్ స్కాంలో ప్రధానపాత్రదారుడు రౌడీషీటర్ యాదగిరి అరెస్ట్ను కూడా సీబీఐ తన ఎత్తుగడలకు వాడుకుంది. జులై4 , 2012న వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే ముందటి రోజే అంటే...3జులై, 2012న యాదగిరిని అరెస్ట్ చేసి తమ ప్రణాళికను ఏసీబీ చేత సీబీఐ పకడ్బందీగా అమలు చేసిందనే ఆరోపణలు కూడా ఆ సంస్థపై ఉన్నాయి . తర్వాత తనకేం తెలియనట్లు బెయిల్ స్కాం కేసును తమకు ఇవ్వమని సీబీఐ అడగడం కూడా పెద్ద డ్రామే అంటున్నారు నిపుణులు. అంతేకాదు వైఎస్ జగన్ కేసులో చార్జిషీట్ల మీద చార్జిషీట్లు వేయడంలో కూడా సీబీఐ తన మార్కును ప్రదర్శిస్తోంది. మానసికంగా, న్యాయపరంగా వైఎస్ జగన్ను, ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తోంది. వైఎస్ జగన్ కేసు విషయంలో సీబీఐ తన పరిధులను దాటిందనే విమర్శలు కూడా వచ్చాయి. తటస్థంగా ఉండాల్సిన సీబీఐ ఇలా ఎవరో చెప్పినట్లు..ఇంకెవరో నడిపిస్తున్నట్లు నడుచుకోవడమే కామన్ మ్యాన్ను కూడా ఆలోచింపచేస్తుంది.













