తెలుగు తల్లీ, ఘంటసాల విగ్రహాలకు అవమానం
- Details
- Category: రాష్ట్రీయం
-
29 Dec 2012
- Published on Saturday, 29 December 2012 11:51
ప్రపంచ తెలుగు మహసభలు తిరుపతిలో వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతి నగరాన్ని ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దింది. నగరంలోని ప్రముఖుల విగ్రహాలన్నింటిని అందంగా అలంకరించిన మహాసభల నిర్వాహకులు ఆ రెండు విగ్రహాలను చూడనట్టు వదిలేశారు. రోజూ అదే మార్గం గుండా సభలకు వెళ్లే అధికారులు... వాటిని పట్టించుకోకుండా అవమానించారు. అసలు ఆ విగ్రహాల పట్ల నిర్వాహకులకు ఎందుకంత వివక్ష... ఇంతకీ ఆ విగ్రహాలు ఎవరివి.
ఈ విగ్రహం రాయలసీమలోనే మొట్టమొదటి తెలుగు తల్లి విగ్రహం. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీనిని ఆవిష్కరించారు. రెండవది ప్రఖ్యాత గాయకుడు ఘంసాలది. ఈ రెండు విగ్రహాలపై తెలుగు మహాసభల నిర్వాహకులు వివక్షత చూపారు. సభా వేదికలో హడావుడిగా రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి చేత తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరింపచేసిన నిర్వాహకులు... ఈ విగ్రహాన్ని మాత్రం గుర్తించలేదు. దీనిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టింది.....
మహానేత వైఎస్ ఆవిష్కరించినందునే తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పార్టీ నేత చెవిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
తెలుగు తల్లి విగ్రహంతో పాటు ప్రఖ్యాత గాయకుడు ఘంటసాల విగ్రహాన్ని సైతం సభల నిర్వాహకులు పట్టించుకోలేదు. ఇతర నాయకుల విగ్రహాలను అందంగా తీర్చిదిద్దిన నిర్వాహకులు ఘంటసాల విగ్రహానికి కనీసం పూలమాల కూడా వేసిన పాపాన పోలేదు. తెలుగు విశిష్టతలను తెలిపే విగ్రహాలను గుర్తించని ఈ పాలకులు తెలుగు అభ్యుదయానికి ఏ మేరకు కృషి చేస్తారోనని భాషాభిమానులు ప్రశ్నిస్తున్నారు.











