సాక్షి అశ్రుపూర్వక నివాలి
- Details
- Category: రాష్ట్రీయం
-
29 Dec 2012
- Published on Saturday, 29 December 2012 12:08
దేవుడు కనికరించలేదు.. వైద్యుల కృషి ఫలించలేదు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు కన్నుమూసింది. సింగపూర్లో చికిత్స పొందుతున్న 23 ఏళ్ల వైద్య విద్యార్ధిని ఈ తెల్లవారుఝామున ప్రాణాలు విడిచింది. భారత కాలమాన ప్రకారం 2.15 నిమిషాలకు యువతి చనిపోయినట్టు సింగపూర్ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచింది గ్యాంగ్ రేప్ బాధితురాలు.
ఈనెల 16న ఢిల్లీలో బస్సులో సామూహిక అత్యాచారానికి గురైన వైద్య విద్యార్ధిని మృతిచెందినట్టు సింగపూర్ వైద్యులు ప్రకటించారు. గ్యాంగ్ రేప్ దుర్ఘటన అనంతరం యువతికి ఢిల్లీలోని సప్ధర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. పొత్తి కడుపు, మెదడుకు తీవ్రగాయాలు కావడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించినా పరిస్థితిలో మెరుగుదల కనిపించలేదు. దీంతో ఆమెను 27వ తేదీన సింగపూర్కు తరలించారు. అవయవ మార్పిడిలో విశేష అనుభవమున్న మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో చేర్చారు. అప్పట్నుంచి ఆమెకు అదే ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. అయితే శుక్రవారం ఆమె పరిస్థితి మరింత విషమించింది. మెదడులో తీవ్ర గాయమైనట్టు గుర్తించారు. అలాగే కీలక అవయవాలు విఫలమైన సంకేతాలు కనిపించాయి. బిపి పల్స్ రేట్ పడిపోయాయి. పొత్తి కడుపు, ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకింది. చివరకు తెల్లవారుజామున బాధితురాలు మరణించింది. బాధితురాలితో పాటు కుటుంబ సభ్యులు కూడా సింగపూర్ వెళ్లారు.
అయితే కేంద్ర ప్రభుత్వ తీరును అంతకు ముందే వైద్యులు తీవ్రంగా తప్పుబట్టారు. అత్యాచార బాధితురాలి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆమెను మెరుగైన చికిత్స పేరుతో ఆగమేఘాలపై సింగపూర్ ఆస్పత్రికి తరలించడాన్ని పలువురు వైద్య నిపుణులు తీవ్రంగా తప్పుబట్టారు. ఒక రోగిని అటువంటి పరిస్థితుల్లో తరలించడం ఎంతమాత్రం సరికాదన్నారు. ఇది ఘోర తప్పిదమని, ఇటువంటి నిర్ణయం తీసుకునే ముందు బాధితురాలికి అయిన గాయాలను ప్రతి ఒక్కరూ పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఢిల్లీలో బస్సులో సామూహిక అత్యాచారానికి గురైన వైద్య విద్యార్థినికి ఇన్ఫెక్షన్ సోకడంతో పూర్తిగా వెంటిలేటర్పైనే ఆధారపడి ఉంది. దీనికితోడు తీవ్రమైన జ్వరంతో బాధపడుతోంది. బీపీ, పల్స్ పడిపోవడం, ఊపిరితిత్తులు, పొత్తికడుపుకు ఇన్ఫెక్షన్ సోకడంతో ఆమె పరిస్థితి పూర్తిగా విషమించింది. అలాంటప్పుడు ఆమెను సింగపూర్ ఎలా తరలిస్తారు?' అని ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రికి చెందిన అవయవ మార్పిడి, గ్యాస్ట్రో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ సమీరన్ నంది ప్రశ్నించారు. ముఖ్యంగా ఇటువంటి కేసుల్లో సుదీర్ఘకాలంపాటు చికిత్స అవసరమవుతుందన్నారు. బాధితురాలికి అవయవ మార్పిడి ఆపరేషన్ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నా కొన్ని నెలలపాటు వేచిచూడాల్సి ఉంటుందని సమీరన్ చెప్పారు. దీనికితోడు విమానంలో ఆరు గంటలపాటు ప్రయాణించాల్సి రావడం వల్ల బాధితురాలు 'మెడికల్ ట్రామా'కు గురై ఉంటుందన్నారు. దీనిపై ఎయిమ్స్, జి.బి. పంత్, సఫ్దర్జంగ్, సర్ గంగారామ్ ఆస్పత్రుల్లోని వైద్య నిపుణులను సంప్రదించగా వారు కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ తనను విదేశాలకు తరలించాలని బాధితురాలు స్వయంగా కోరినా లేదా ఆమె కుటుంబ సభ్యులు అడిగినా రోగి క్షేమం దృష్ట్యా అది శ్రేయస్కరంకాదని అభిప్రాయపడ్డారు. అత్యాచార బాధితురాలిని సింగపూర్కు తరలించాలన్న నిర్ణయం వైద్యులతో సంబంధం లేకుండా.. '10 జన్పథ్'లో జరిగిపోయిందని సమాచారం. ఢిల్లీలో చికిత్స కొనసాగిస్తే ఆందోళనలను అదుపు చేయలేమని, వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ హుటాహుటిన ఆమెను సింగపూర్ తరలించినట్లు తెలుస్తోంది. మొత్తానికి వైద్యనిపుణులు ఆవేదన వ్యక్తం చేసినట్టే ఆమె మృతి చెందింది.











